అర్జున్ సమాచారం:
కార్యనిర్వహణాధికారి . శ్రీనివాసరావు పలు ప్రదేశాలను ఆకస్మికంగా పరిశీలించారు.
పాతాళగంగ స్నానఘట్టాలు, సిద్ధరామప్ప వాణిజ్య సముదాయం, పలు ప్రదేశాలలోని శౌచాలయాలు మొదలైనవాటిని కార్యనిర్వహణాధికారి పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారన్నారు. అందుకే పాతాళగంగ పరిసరాలను, పాతాళగంగమెట్లను, ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తుండాలని పారిశుద్ధ్య విభాగపు అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు పాతాళగంగ పరిసరాలలో మరియు మెట్ల మార్గంలో మరిన్ని విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. పాతాళగంగలో మరిన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ మరియు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ బోర్డుల ఏర్పాటు శాశ్వత ప్రాతిపదికతో ఉండాలన్నారు.
అదేవిధంగా పాతాళగంగలో ప్రమాదాలు జరగకుండా వుండేందుకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పాతాళగంగ నీటిమట్టాన్ని బట్టి ఎప్పటికప్పుడు బ్యారికేడింగును పరిశీలిస్తుండాలన్నారు. ప్రమాదాలు నిరోధించేందుకు ఏర్పాటు చేయబడిన ఈతనిపుణులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
పాతాళగంగలోని స్త్రీలు దుస్తులు మార్చుకునే గదులకు మరియు శౌచాలయాలకు ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
పాతాళగంగతో పాటు క్షేత్రపరిధిలోని అన్ని శౌచాలయాలను నిరంతరం పరిశుభ్రంగా ఉండేవిధంగా నిర్వహిస్తుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. శౌచాలయాలకు ఎటువంటి అంతరాయం లేకుండా నీటిసరఫరా ఉండాలని నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించారు.
ఆయా పరిసరాలలోని పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయములో ఉద్యానవనం, పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నారు.
అనంతరం సిద్ధరామప్ప వాణిజ్య సముదాయాన్ని పరిశీలించారు. దుకాణసముదాయంతో పాటు పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే వాణిజ్య సముదాయం నందు చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు తొలగించేవిధంగా సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు.
==========================